మెదక్, వెలుగు: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం మెదక్ ఔట్డోర్ స్టేడియంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద క్రీడాకారులతో సరదాగా ఫుట్బాల్ఆడారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలు సాధించిన విజయాలు,- వారికి ఉన్న అడ్డంకులు, అనుభవిస్తున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు ఆలోచించడానికి ఏర్పాటు చేసే కార్యక్రమమే ఈ మహిళా దినోత్సవం అన్నారు.
పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మరింత మంది జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. భవిష్యత్లో ఏం సాధించాలనే విషయమై మీ కంటూ ఒక కలల పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కలెక్టర్ సహకారంతో బేటీ బచావో -బేటీ పడావో కార్యక్రమంలో అన్ని క్రీడల్లోజాతీయస్థాయిలో రాణించిన జిల్లా క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశామన్నారు.
జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ సహకారంతో ఫుట్బాల్ క్రీడాకారులు నిత్యం శిక్షణ పొందడానికి అనువైన ఏర్పాట్లు చేశామన్నారు. మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త సంతోష, ఫుట్బాల్ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు వంశీకృష్ణ, వినయ్, మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు జుబేర్, ఉపాధ్యక్షుడు ఎం ఎల్ ఎన్ రెడ్డి పాల్గొన్నారు.